Telangana news updates: ఆన్ లైన్ గేమింగ్ కు బానిసైన ఓ వివాహిత.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో చోటు చేసుకుంది. వలిగొండ మండలం గోల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశ్ భార్య రాజేశ్వరి.. ఈ దారుణానికి ఒడిగట్టింది. గత కొంత కాలంగా ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ.. బెట్టింగ్ కు పాల్పడుతోంది. ఈ క్రమంలో తెలిసినవారి నుంచి అప్పులు కూడా తీసుకుంది. అయితే గేమింగ్ యాప్ ల నుంచి ఎలాంటి డబ్బులు రాకపోవడమే కాకుండా.. అప్పులు తడిసి మోపెడయ్యాయి. బెట్టింగుల్లో ఏకంగా 8 లక్షలు పోగొట్టుకున్న రాజేశ్వరి.. చివరకు ప్రాణాలు తీసుకుంది.
తన ఇద్దరు పిల్లలైన మూడేళ్ల అనిరుధ్, రెండేళ్ల హర్షవర్ధన్ తో కలిసి.. నీటి సంపులో దూకింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు పోయాయి. ముగ్గురి మృతి పట్ల స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోధనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆన్ లైన్ గేమ్స్కు బానిసలై.. చాలామంది భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో పలువురు తమ జీవితాలనే ఫణంగా పెడుతున్నారు. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అప్పులు ఎక్కువై.. తిరిగి చెల్లించలేక, ఒత్తిళ్లను తట్టుకోలేక బలైపోతున్నారు. ఆ కేటగిరీలో ఓ వివాహిత కూడా చేరడం.. పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది.