Hyderabad latest news(ts news updates): హైదరాబాద్ ముషీరాబాద్ లో భారీ చోరీ జరిగింది. ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్.. ఇంట్లో చొరబడ్డ ఓ దొంగ భారీ మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, భూ దస్తావేజులను దొంగిలించాడు. అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ చోరీ వెనుక ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు దొంగ చెప్పడం ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
సురేందర్ అనే వ్యక్తి.. భూమి కొనుగోలు చేస్తానంటూ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్కు ఇటీవల పరిచయం అయ్యాడు. చర్చల పేరుతో తరచుగా రాకపోకలు సాగించాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటికి వచ్చిన సురేందర్.. తన వెంట టిఫిన్, కొబ్బరి నీళ్లు తీసుకువచ్చాడు. ఆ కొబ్బరి నీళ్లలో మత్తు మందు కలిపాడు. కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శ్యామ్యూల్ స్పృహతప్పి పడిపోయాడు. ఇదే ఛాన్స్గా భావించిన సురేందర్.. ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. 5 లక్షల రూపాయల నగదుతో పాటు 30 తులాల బంగారం చోరీ చేశాడు.
మత్తు ప్రభావంతో నాలుగు రోజుల పాటు కోమాలోనే ఉన్నాడు శామ్యూల్. కోలుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు.. నిందితుడు సురేందర్ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. సంచలన విషయాలు బయటపెట్టాడు. దుండిగల్ ఎస్ఐ కృష్ణ హస్తం తన వెనుక ఉండి ఈ వ్యవహారం జరిపించినట్లు వెల్లడించడంతో పోలీసులు అవాక్కయ్యారు.
ఎస్ఐ కృష్ణ గతంలో శామ్యూల్ నుంచి భూమి కొనుగోలు చేశాడు. ఆ సమయంలోనే అతని దగ్గర భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించాడు. సురేందర్ను రెచ్చగొట్టి.. శామ్యూల్ నుంచి భూముల పత్రాలు తీసుకొస్తే.. మంచి కమిషన్ ఇస్తానని ఆశ పెట్టాడు. కమిషన్కు కక్కుర్తి పడి.. శామ్యూల్కు మత్తుమందు ఇచ్చి.. భూమి పత్రాలు దొంగిలించాడు సురేందర్. విచారణలో ఎస్ఐ కృష్ణ హ్యాండ్ ఉన్నట్టు తేలింది. అయితే ఆ ఎస్సై రెండు రోజులుగా సెలవుల్లో ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.