Latest congress news in telangana: ఎన్నికల సమయంలో చేరికల జోష్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. ఖమ్మం జిల్లా వేదికగా జరుగనున్న బహిరంగ సభలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా.. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుండగా.. అదే సమయంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సీనియర్ లీడర్ భట్టి పాదయాత్ర ముగింపు సభను కూడా ఖమ్మంలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఒకే వేదికపై రెండు బహిరంగ సభలు నిర్వహించాల్సి రావడంపై.. కాంగ్రెస్ నాయకుల్లో సరికొత్త చర్చకు దారి తీస్తోంది.
ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పార్టీలో చేరడం ఖాయమైన సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏకంగా 5 లక్షల మందితో తన సత్తాను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఖమ్మంలో 100 ఎకరాల సభాస్థలిని సిద్ధం చేస్తున్నారు. అదే సభలో తన అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ సభ కోసం ఏఐసీసీ పెద్దలు రాహుల్ లేదా ప్రియాంకగాంధీ వస్తారనే ప్రచారం ఉంది. దీంతో ఈ సభను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భట్టి విక్రమార్క గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్నారు. తన పాదయాత్రను సొంత జిల్లా అయిన ఖమ్మంలో ముగించేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో భట్టిని ఘనంగా సన్మానించాలని నిర్ణయించారు. ఈ ముగింపు సభ కోసం హైకమాండ్ నుంచి పెద్దలు వస్తారనే ప్రచారం ఉంది. దీంతో ఈ రెండు సభలు ఖమ్మం వేదికగా జరగడంపైనే.. కాంగ్రెస్ పార్టీలో మల్లగుల్లాలు ప్రారంభమయ్యాయి. రెండు వేర్వేరుగా నిర్వహించే కంటే.. ఒకే వేదికగా నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రేపు ఖమ్మం జిల్లా కు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. దీంతో ఖమ్మం వేదికగా జరగనున్న రెండు సభలపై క్లారిటీ రానుందని చెబుతున్నారు.