Etela Rajender latest news telugu(TS politics): ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేశారంటూ ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి 20 కోట్లకు సుపారీ ఇచ్చారంటూ కలకలం రేపారు. గ్యాంగ్ స్టర్ నయీం రెక్కీ చేస్తేనే భయపడలేదు.. 20 కోట్ల సుపారీకి భయపడతానా అంటూ రాజేందర్ ధైర్యం వ్యక్తం చేశారు. ప్రజలే తనను కాపాడుకుంటారంటూ ధీమాగా చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కౌశిక్రెడ్డి తప్పుబట్టారు. ఈటల రాజేందర్ వల్లే తనకు ప్రాణహాని ఉందని.. గతంలో పలుమార్లు మర్డర్ అటెంప్ట్ చేశారని చెప్పారు. ఇలా ఈటల చుట్టూ రోజంతా హత్యా రాజకీయం హాట్ హాట్గా నడిచింది.
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు కేంద్ర ‘వై’ కేటగిరీ భద్రత కల్పించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ మేరకు కేంద్ర నిఘా వర్గాల నుంచి నివేదిక వచ్చిందని.. రెండు మూడు రోజుల్లో అధికార ప్రకటన రావొచ్చంటూ పలు ఛానెల్స్లో బ్రేకింగ్ న్యూస్ నడిచాయి. అయితే, ఈ వార్తలు నిజం కాకపోవచ్చని కూడా అంటున్నారు. ఓ రాష్ట్రంలో ఓ వ్యక్తి నుంచి ప్రాణహాని ఉంటే.. కేంద్రం ఎలా సెక్యూరిటీ ఇస్తుందని.. అందులోనూ అత్యంత ముప్పు ఉండే, ప్రముఖులకు కల్పించే.. వై కేటగిరీ భద్రత ఇస్తారనడం.. అసత్య ప్రచారమేనని తెలుస్తోంది. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని గుర్తు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప.. అది సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు.
ఈటల రాజేందర్ అంశంపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. తెలంగాణలో హత్యా రాజకీయాలకు చోటు లేదని.. అలాంటి వాటిని బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం కానీ.. అలాంటి పనులు చేయమని చెప్పారు. ఈటల తనకు సోదర సమానమని.. నిజంగా ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నట్టైతే.. భద్రత పెంచాలని తాను డీజీపీ సూచిస్తానని తెలిపారు. ఈటల రాజేందర్కు రక్షణ కల్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు మంత్రి కేటీఆర్.