Telangana congress latest news: కాంగ్రెస్.. ఎన్నికల కదనరంగంలోకి దిగింది. నాలుగు నెలల ముందే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ఇదే సరైన సమయమంటూ.. కలిసుంటే మనదే విజయమంటూ.. నేతల్లో సమరోత్సాహం నూరిపోసింది. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పార్టీలో విభేదాలు ఉంటే ఇప్పుడే పరిష్కరించుకోవాలని.. మీడియాకు ఎక్కొద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది అధిష్టానం. బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలకు దిశానిర్దేశం చేశారు రాహుల్ గాంధీ.
కర్నాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికలకు ముందుగానే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ చేశారు. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీయే టికెట్లను ఖరారు చేస్తుందని.. అప్పటి వరకూ ఏ ఒక్క నాయకుడూ ఎవరి పేరునూ అభ్యర్థిగా ప్రకటించ వద్దని ఆదేశించారు రాహుల్.
తెలంగాణలోనూ కర్నాటక తరహా హామీలు ఇవ్వాలని.. అయితే ఇచ్చే ప్రతీ హామీ ఆచరణలో సాధ్యమయ్యేలా ఉండాలని సూచించారు. పార్టీకి ఎవరు ఏం చేశారో తెలుసని.. తెలంగాణలో ప్రతీ ఒక్క కాంగ్రెస్ నాయకుడి గురించి తనకు తెలుసునని.. మీటింగ్ విషయాలేవీ మీడియాకు లీక్ చేయొద్దని అన్నారు రాహుల్ గాంధీ.
ధరణి రద్దుపై విస్తృతంగా ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. బీసీలకు మెజార్టీ సీట్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తామని రాహుల్ చెప్పారు. పది రోజుల్లో బూత్ కమిటీలు, మండల కమిటీలు వేయాలని ఆదేశించారు. ఏవైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే.. వీలైనంత త్వరగా సరిచేసుకోవాలని అన్నారు. విభేదాలు ఉంటే రాష్ట్ర ఇన్ఛార్జితో కానీ, తనతో కానీ మాట్లాడమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట మాట్లాడొద్దని.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు రాహుల్గాంధీ.
ఢిల్లీ, ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు.. మాణిక్రావు ఠాక్రే, రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, షబ్బీర్అలీ, రేణుకా చౌదరి తదితరు ఈ మీటింగ్కు హాజరయ్యారు.