Congress party news today(Political news in telangana): తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఒకవైపు పార్టీలో నేతల చేరికలపై దృష్టి పెట్టింది. మరోవైపు ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే.. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది.
పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల చీఫ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనరసింహా, మల్లు రవి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఈ భేటీలో పాల్గొంటారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. పార్టీలో చేరికలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే నేతల చేరికలతో తెలంగాణ హస్తం పార్టీలో జోష్ వచ్చింది. దీంతో అంతర్గత కలహాలను పక్కన పెట్టి నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని, ఇదే ఉత్సాహాన్ని కంటీన్యూ చేయాలని సూచించనున్నారు . బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళితే విజయం తథ్యమని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆసమయంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. మరోసారి ప్రియాంక భాగ్యనగరం రాబోతున్నారు. జులై 16న హైదరాబాద్లో జరిగే బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన ఈ వేడుకల్లో పాల్గొనడానికి ప్రియాంక గాంధీ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.