Bandi Sanjay latest news(Breaking news updates in telangana) : తెలంగాణ బీజేపీ వ్యవహారాలు హస్తినలో కాక రేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న వ్యవహారాలతో నేతలు ఒక్కొక్కరుగా హస్తినకు చేరుతున్నారు. తాజాగా సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు.
బండి సంజయ్ ఢిల్లీ పర్యటన బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. మూడు రోజుల క్రితమే పార్టీ అధిష్టానం ముందు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అమిత్ షా, నడ్డా, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తో పలు కీలకాంశాలపై చర్చించారు. తాము చెప్పాల్సిన అన్ని విషయాలను అధిష్టానం ముందు నిర్మొహమాటంగా చెప్పామని నేతలిద్దరూ మీడియా ముందు ప్రకటించారు. సీఎం కేసీఆర్ కుటుంబం విషయంలో అనుసరిస్తునన మెతక వైఖరితో జరుగుతున్న నష్టాన్ని వివరించారు.
ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం ముగిసిన రెండు రోజుల్లోనే.. బండి సంజయ్ కి పిలుపు వచ్చింది. మరోవైపు వారిద్దరూ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఒకదశలో పార్టీ మారడం ఖాయమన్న ఊహాగానాలు కూడా జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో సంజయ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య సఖ్యత తేవడంపై పార్టీ ముఖ్యనాయకులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక మరో మూడు నెలల్లో ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో.. క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడంపై కూడా బండి సంజయ్ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కాంగ్రెస్ జోరుకు ఎలా కళ్లెం వేయాలన్న అంశంపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.