Ponguleti joining congress(Political news today telangana) : అన్నిపార్టీలు రారమ్మని పిలిచాయి. బీజేపీ అయితే కాళ్లబేరానికి వచ్చింది. ఏది కావాలో చెప్పు.. అంతకుమించే ఇస్తామని ఆఫర్లు ఇచ్చింది. అయినా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలా కాషాయ గాలానికి చిక్కలేదు పొంగులేటి. స్వతహాగా బడా వ్యాపారవేత్త. అయినా బెదరలేదు. ఆశపడలేదు.
కేసీఆర్ను దెబ్బ కొట్టడమే ఆయన ఏకైక లక్ష్యం. అది ఎవరి వల్ల అయితే వారితోనే. సొంతంగా పార్టీ పెట్టాలని కూడా ఆలోచించారు. తెలంగాణ రైతు సమితి-TRS లాంటి కొన్నిపేర్లు కూడా పరిశీలించారు. దండిగా ఆర్థిక, అంగ బలం ఉన్న నేత. పార్టీ పెట్టడం చిటికెలో పని ఆయనకు. అయినా, కొత్త పార్టీ పెట్టలేదు. చివరాఖరికి కాంగ్రెస్లోనే చేరారు.
తన స్థాయిని ఘనంగా చాటేలా.. ఢిల్లి వెళ్లి మరీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీని కూడా కలిశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే తన ఉనికిని బలంగా చాటారు. జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.
ఇంతకీ పొంగులేటి కాంగ్రెస్లోనే ఎందుకు చేరినట్టు? ఇదే విషయాన్ని ఢిల్లీ ప్రెస్మీట్లో వివరించి చెప్పారాయన. తెలంగాణ మేథావులు, ఉద్యమకారులు, ప్రజానీకంతో విస్తృత చర్చలు జరిపానని చెప్పారు. సొంతంగా ప్రముఖ సంస్థలతో సర్వేలు కూడా చేయించానని అన్నారు. అన్నిచర్చలు, అన్నిసర్వేలు కాంగ్రెస్ అయితేనే బెటర్ అని తేల్చాయి. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో పార్టీ అత్యంత బలంగా మారింది. కర్నాటక ఫలితాలు.. తెలంగాణలోనూ ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.
కొత్త పార్టీ పెడితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది మళ్లీ కేసీఆర్కే అనుకూలంగా మారుతుందని.. అందుకే కొత్త పార్టీ ఆలోచన విరమించుకున్నానన్నారు పొంగులేటి. ఇక, బీజేపీలో లుకలుకలతో ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ దారుణంగా పడిపోతోందని చెప్పారు. అధికారం, డబ్బులు, పదవుల కోసమైతే తాను బీజేపీలోకే వెళ్లే వాడినని అన్నారు. తన కుటుంబానికి వ్యాపారాలున్నా.. తాను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కాకుండా.. గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్లోనే చేరానని.. పొంగులేటి వివరించారు.
ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించాల్సిందేనని.. లేదంటే మనల్ని దేవుడు కూడా క్షమించడని మరో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు పిలుపిచ్చారు.