KCR Maharashtra Tour(Today breaking news in Telangana): బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ మరింత ఫోకస్ పెట్టారు. తెలంగాణ తర్వాత ఎక్కువగా మహారాష్ట్రనే టార్గెట్ చేశారు. తరచూ ఆ రాష్ట్రంలో గులాబీ బాస్ పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. తాజాగా మరోసారి మహారాష్ట్ర బాట పట్టారు కేసీఆర్. ఈసారి 600 వాహనాలతో ర్యాలీగా వెళ్లారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో భారీ కార్ల ర్యాలీతో ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్ . ఇప్పుడు కూడా అదే తరహాలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో రోడ్డు మార్గాన ప్రయాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారి పొడవునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాల ఏర్పాటు చేశారు. భారీ వాహన కాన్వాయ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక నేతలు సీఎం వెంట వెళ్లారు.
కూకట్పల్లి, పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తారు. హుమ్నాబాద్, బసవకళ్యాణ్ మీదుగా సాయంత్రానికి మహారాష్ట్రలోని ఒమర్గాకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాత్రికి షోలాపూర్ వెళతారు. హైదరాబాద్ నుంచి సుమారు 315 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు.
కేసీఆర్ ఇప్పటికే నాందేడ్, కాందార్ లోహ, ఔరంగాబాద్, నాగపూర్లో భారీ సభలు నిర్వహించారు. నాగపూర్లో పార్టీ తొలి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించారు. ఔరంగాబాద్, షోలాపూర్, పుణె, ముంబైలోనూ శాశ్వత కార్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పార్టీ యంత్రాంగం పనిచేస్తోంది.
మహారాష్ట్రలో కేసీఆర్ 2రోజులపాటు పర్యటిస్తారు. షోలాపూర్లో రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం తెలుగు ప్రజలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం పండరీపూర్ చేరుకుని శ్రీ విఠల రుక్మిణీ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత స్థానికంగా జరిగే బీఆర్ఎస్ సభలో ఎన్సీపీ దివంగత ఎమ్మెల్యే భరత్ భాల్కే కుమారుడు భగీరథ్ భాల్కే కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. మధ్యాహ్నం తుల్జాపూర్ భవానీమాత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక విమానంలో కేసీఆర్ హైదరాబాద్కు చేరుకుంటారు.