Congress news telangana(TS politics): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఈ నేతలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్గాంధీతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. వీరు కూడా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుస్తారు.
అలాగే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల ముఖ్య నాయకులకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి, షర్మిల కాంగ్రెస్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారం ఇలాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం తర్వాత పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో చేరికపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
ఆదివారం రాత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఉన్నారు. తెలంగాణలో అసలైన ఆట మొదలు కాబోతోందని పొంగులేటి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. ఆ విషయాలను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని తెలిపారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తానని పొంగులేటి చెప్పారు. ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్లో చేరతారని తెలిపారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి రాజకీయ పునరేకీకరణ జరగబోతోందన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో తన పాత్ర కూడా ఉందని స్పష్టంచేశారు. ఆ పార్టీలో తాను ఏ పదవులు ఆశించలేదని.. అలాగే ఇప్పుడు కాంగ్రెస్లోనూ పదవులు ఆశించి చేరడం లేదని తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేత కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. కూకట్పల్లితోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని సమాచారం. రాష్ట్ర నేతలు అధిష్ఠానం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లే అవకాశాలున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో అధిష్ఠానం సర్వేలు చేయిస్తోందని సీనియర్ నేతలు అంటున్నారు. గెలిచే అవకాశాలున్నవారికే టికెట్లు ఇస్తారని స్పష్టం చేస్తున్నారు.