Revanth Reddy latest news(Telangana politics) : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల జరగడంతోనే కేటీఆర్ హస్తినకు వెళ్లారని ఆరోపించారు. ఐటీ సోదాల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయన్నారు. ఈ విషయాలు పత్రికల్లో, మీడియాలో రాకుండా మేనేజ్ చేశారని వివరించారు. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధికి నిధులు తెచ్చేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ రోడ్ల కోసం మాట్లాడేందుకు కేంద్రమంత్రులను కలవలేదని.. సొంత ఆస్తుల గుట్టు బయటకురాకుండా మేనేజ్ చేసేందుకు వారిని కలిశారని ఆరోపించారు. రహస్య ఆస్తుల వివరాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేసీఆర్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దలతో ఏమీ కాదని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. తమతో కలిసి గల్లీలో పోరాడాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్ సడెన్ గా ఢిల్లీ వెళ్లడంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎప్పుడూ కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్లని మంత్రి ఉన్నట్టుండి హస్తిన బాట పట్టడంపై సందేహాలు వచ్చాయి. ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై , కేసీఆర్ కుటుంబంపైనా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.