Pawan Kalyan latest news today(Political news in AP): చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమంతో కాక రేగింది. సర్కార్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ హాట్ హాట్గా నడిచింది. తుని రైలు దగ్థం ఘటనతో ఉద్యమం అదుపుతప్పింది. ఆ సాకుతో ముద్రగడను కేసులతో మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించారు. రైలుకు నిప్పు పెట్టింది వైసీపీ వర్గీయులేననే ప్రచారమూ ఉంది. ఆ దెబ్బతో మెజార్టీ కాపులంతా అప్పటి టీడీపీ సర్కారుకు యాంటీగా మారారు. అంటే, పరోక్షంగా వైసీపీకి ఫేవర్ అన్నట్టు.
ఇక్కడే అప్పటి విపక్ష నేత జగన్ తన మాస్టర్ మైండ్ అప్లై చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరి జిల్లాలకు వచ్చిన వైసీపీ అధినేత.. కీలక స్టేట్మెంట్ చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని.. కాపుల సపోర్ట్ తనకు అవసరం లేదని.. సంచలన కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. అదేంటి? జగన్ అలా అన్నారేంటి? అనే చర్చ పెద్ద ఎత్తున నడిచింది. ఎన్నికల తర్వాత కానీ అర్థం కాలేదు జగన్ వ్యూహం ఏంటో.
ముద్రగడను వేధించడం, కాపు ఉద్యమం వల్ల.. ఆనాడు కాపులంతా చంద్రబాబుకు యాంటీగా మారారు. సో, వాళ్లు ఎలాగూ వైసీపీకే మద్దతు తెలిపారు. అయితే, గోదావరి జిల్లాలంటే కేవలం కాపులేనా? మిగతా కులాలు కూడా ఉంటాయిగా. కాపులకు రిజర్వేషన్లు అంటే.. బీసీలంతా అభద్రతా భావానికి గురవుతారుగా. ఈ చిన్న లాజిక్తోనే జగన్ ఆనాడు కాపు రిజర్వేషన్లు ఇవ్వనని.. వాళ్ల సపోర్ట్ తనకు అవసరం లేదని అన్నారని అంటారు. కాపులు ఎలాగూ చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీకే ఓటేశారు. మిగతా కులాలు సైతం వైసీపీకే జై కొట్టాయి. ఇలా అంతా కలిసి జగన్కు పట్టం కట్టాయి.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సైతం ఇదే స్ట్రాటజీని అప్లై చేస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని వారాహి యాత్ర ప్రకటించగానే.. ఫుల్ అటెన్షన్ క్రియేట్ అయింది. ఇక జగన్కు, వైసీపీ గ్యాంగులకు మూడినట్టే అనుకున్నారు. కానీ, వారాహి మొదలయ్యాక.. పవన్ ప్రసంగాలు విన్నాక.. కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. వైసీపీకంటే కూడా కులాల గురించి, కాపుల గురించి తన అభిప్రాయాలను చెప్పడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎక్కడ వారాహి సభ జరిగినా.. కులాల ప్రస్తావనే తీసుకొస్తున్నారు. తనను కేవలం కాపుగా మాత్రమే చూడొద్దని.. తాను పుట్టిన కులాన్ని గౌరవిస్తానని చెప్పుకొస్తున్నారు.
అదేంటి.. పవన్ వైసీపీపై పూనకంతో ఊగిపోతారనుకుంటే ఇలా కాపులు, కులాల గురించే స్పీచులు దంచుతున్నారేంటి? అని అభిమానుల్లో కాస్త నిరుత్సాహం నెలకొంది. అయితే, పవన్ మాటల వెనుక.. జగన్ తరహా వ్యూహం ఉందంటున్నారు. ఇన్నాళ్లూ జనసేనానిని.. కేవలం కాపు నేతగానే ప్రొజెక్ట్ చేయడంలో అధికార వైసీపీ సక్సెస్ అయింది. తనపై పడిన కాపు మరకను కడిగేసుకోవాలని.. తాను అందరివాడినని.. అన్నికులాల వాడినని.. బలంగా చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే పవన్ అలాంటి ప్రసంగాలు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. అటు కాపుల సపోర్ట్ ఎలానూ ఉంటుంది.. మిగతా కులాలూ అక్కున చేర్చుకునే ఛాన్స్ వస్తుంది. గత ఎన్నికల్లో జగన్ ఇలాంటి స్ట్రాటజీతోనే.. ఒక్క సీటు మినహా గోదావరి జిల్లాలను క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడు జనసేనాని సైతం గోదావరి బెల్ట్ను గంప గుత్తగా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అది పొత్తులతోనైనా.. సింగిల్గానైనా.
ఈ విషయం గుర్తించే.. పవన్ ప్రసంగాలతో అధికార పార్టీ ఉలిక్కిపడుతోంది. పోటీగా ముద్రగడ పద్మనాభంతో లేఖలు రాయించి.. మళ్లీ కాపుల్లో కాక రేపుతోంది. ముద్రగడకు సపోర్ట్గా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి పోసాని వరకూ.. అంతా ఒక్కసారిగా మీడియా ముందు వాలిపోయారు. రాజకీయాన్ని మళ్లీ కాపుల చుట్టూ తిప్పేసి.. పవన్ను కేవలం కాపు నేతగానే ఫిక్స్ చేయాలని తెగ ఆరాటపడుతున్నారు. కానీ, రాటుదేలిన జనసేనాని.. వారాహి స్టీరింగ్ను చాలా చాకచక్యంగా తిప్పుతున్నారు. మరక మంచే చేసేలా.. కులాల ప్రస్తావనతో కుల రాజకీయాన్ని కడిగేస్తున్నారు.