Cheetah attack in tirumala(AP latest news): తిరుమలలో బాలుడిపై దాడి చేసిన చిరుతను అధికారులు బోనులో బంధించారు. చిరుత ఆచూకీ కోసం 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని టీటీడీ DFO శ్రీనివాసులు అన్నారు. చిరుత అడుగుల సాయంతో.. ఎక్కువగా ఏ ప్రాంతాల్లో తిరుగుతుందో గుర్తించి.. 2 బోనులు ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో.. శుక్రవారం రాత్రి చిరుత బోనులో చిక్కిందని టీటీడీ DFO శ్రీనివాసులు తెలిపారు.
చిరుతలు మనుషులపై దాడి చేయవని టీడీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఓ పిల్లిని దాడి చేసే క్రమంలో బాలుడిపై దాడి చేసిందని తెలిపారు. చిరుతను పట్టుకునే క్రమంలో.. దాని తల్లి జాడ కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు.
గురువారం రాత్రి అలిపిరి నడకమార్గంలో.. బాలుడిపై చిరుత దాడి చేసి గాయపర్చింది. చిరుత నోట చిక్కిన బాలుడు అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడిని లాక్కుని అడవిలోకి పరుగులు తీసింది ఆ చిరుత. ఒక్కసారిగా ఉలిక్కిపడిన బాలుడి తల్లిదండ్రులు.. అక్కడే ఉన్న పోలీసులు, భక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి పారిపోయింది. బాలుడికి తీవ్రగాయాలైనప్పటికీ బతికి బట్టకట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్నాడు.
చిరుత దాడితో నడకదారిలో భక్తుల భద్రతపై భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అదే ప్రాంతంలో ఇంకా మూడు చిరుతలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు, టీటీడీ కొత్త రూల్స్ తెచ్చింది. సాయంత్రం తర్వాత భక్తులు ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని.. సెక్యూరిటీ గార్డ్ తోడుగా 200 మందిని ఓ గుంపుగా మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.