Uttam Kumar Reddy today news(Telangana news live) : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల కాలం నడుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ రాష్ట్రంపై పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న చాలా మంది బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
పార్టీలో చేరేందుకు కీలక నేతల ఉత్సాహం చూపిస్తుండటంతో కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. దీంతో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ బాస్ వ్యూహ రచన చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కీలక నేతలను కారు ఎక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో గులాబీ కుండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. భార్య పద్మావతితో కలిసి బీఆర్ఎస్ లో చేరతారని తెలుస్తోంది.
కొంతకాలంగా ఉత్తమ్ ఫ్యామిలీ బీఆర్ఎస్లోకి వెళ్లాలని భావిస్తుందని టాక్ వినపడుతోంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సీఎం కేసీఆర్తో టచ్లో ఉన్నారని సమాచారం. ఇద్దరికి ఎమ్మెల్యేల టికెట్లతోపాటు మంత్రి పదవి ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఉత్తమ్, కేసీఆర్ మధ్య ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాయభారం నడుపుతున్నారని అంటున్నారు .
ఓ వైపు నేతల చేరికలతో కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారే ఆలోచన చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.