Today KCR meeting live(Telangana politics): కేసీఆర్ మాటల గురించి తెలిసిందేగా. మామూలుగా ఉండవు ముచ్చట్లు. మాటలతో అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. తెలంగాణ వెలిగిపోతోందని.. అందుకే అదే సాక్షం అంటూ ఊదరగొడుతుంటారు. లేటెస్ట్గా పటాన్ చెరులో 183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. మేధా రైల్వే ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు అందజేశారు. ఇలా ఎన్నికల వేళ వరుసబెట్టి.. గ్రాండ్ ఈవెంట్స్ చేస్తున్నారు సీఎం.
పటాన్ చెరు బహిరంగ సభలో మాట్లాడుతూ.. వరాల ఝల్లు కురిపించారు. మళ్లీ గెలిపిస్తే.. పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తామన్నారు. పటాన్చెరులోని సమస్యలన్నీ తనకు తెలుసునని.. గతంలో ఈ ప్రాంతంలో 3 రోజులు పాదయాత్ర చేశానని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని 55 గ్రామ పంచాయతీలకు 15లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మూడు మున్సిపాలటీలకు రూ.30 కోట్ల నిధులు ఇస్తామన్నారు. పటాన్ చెరుకు పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేస్తున్నామన్నారు. పటాన్ చెరులో ఐటీ పరిశ్రమలు వచ్చేలా చూడాలని కేటీఆర్కు చెప్తానన్నారు కేసీఆర్.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. అభివృద్ధి బాగుంది కాబట్టే.. తెలంగాణలో భూముల విలువ భారీగా పెరిగిందని.. ఇదే విషయం ఇటీవల చంద్రబాబు నాయుడు సైతం చెప్పారన్నారు. తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే.. ఏపీలో 10 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు కేసీఆర్. మంచి నాయకత్వం, ప్రభుత్వం ఉంటే భూముల రేట్లు పెరుగుతాయన్నారు.
అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. తెలంగాణలో భూముల ధర పెరగడానికి.. ప్రభుత్వానికి సంబంధం ఏంటని అన్నారు. రాజకీయ అవసరం కోసం కేసీఆర్ చంద్రబాబుతో సహా ఎవరినైనా వాడుకుంటారని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిందే టీడీపీ అని చంద్రబాబు అంటుంటారని.. మరి, ఆ విషయాన్ని కూడా కేసీఆర్ అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.
అంతకుముందు.. మేధా రైల్వే ఫ్యాక్టరీని ప్రారంభించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఇలాంటి ఫ్యాక్టరీ ఉండటం గర్వంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ ద్వారా 2వేల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. మేధాకు అనుబంధ సంస్థగా మలేషియా కంపెనీ వచ్చిందని చెప్పారు. ముంబై నుంచి మోనో రైలు ఆర్డర్ కూడా వచ్చిందని.. భవిష్యతలో రైలు మొత్తం ఇక్కడే తయారవుతాయని కేసీఆర్ అన్నారు.
అటు.. ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 117 బ్లాకులుగా విభజించారు. భవనాలను జీ+9, జీ+10, జీ+11 అంతస్తులుగా నిర్మించారు. 37 శాతం భూమిలో ఇళ్లు కట్టారు. మిగిలిన 63 శాతం స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించారు. లబ్ధిదారులకు ఇంటి పత్రాలను సీఎం కేసీఆర్ అందించారు.