Revanth Reddy meeting live today(Political news in telangana): స్మృతివనం. అమరవీరుల స్మారక స్థూపం. తెలంగాణ ఉద్యమ బలిదానాలకు సాక్షీభూతం. ట్యాంక్ బండ్ తీరాన.. మిరిమిట్లు గొలుపుతోంది. అయితే, ఆ వెలుగుజిలుగుల వెనుక వంద కోట్ల అవినీతి చీకటి మరకలు ఉన్నాయంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టెండర్ నుంచి నిర్మాణం వరకూ.. అంతా దోపిడీయేనంటూ పూసగుచ్చినట్టు లోగుట్టు బయటపెట్టారు. కేటీఆర్ సన్నిహితులకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని.. తెలంగాణ అమర వీరుల బలిదానాలను అవమానించారని.. రేవంత్రెడ్డి మండిపడ్డారు.
అమరవీరుల స్థూపం నిర్మాణం కోసం 2018లో రూ.63 కోట్ల అంచనాతో టెండర్ పిలిస్తే.. అది పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఏకంగా రూ.176 పెంచేశారని విమర్శించారు. ఒకే కంపెనీతో మూడు డమ్మీ టెండర్లు వేయించారని ఆరోపించారు. కేటీఆర్ ఎంట్రీతో.. కేసీ పుల్లయ్య కంపెనీ కాస్తా.. కేపీసీ కంపెనీగా మారిపోయిందని.. కంపెనీ అడ్రెస్ విజయవాడకు షిఫ్ట్ అయిందని చెప్పారు.
పైకి చూస్తే స్మృతివనం బాగున్నట్టు కనిపిస్తున్నా.. నిర్మాణం పూర్తిగా నాసిరకంగా ఉందన్నారు. 10MM స్టీల్తో కట్టాలని మొదట భావించినా.. కేటీఆర్తో కుమ్మక్కైన ఆంధ్ర కాంట్రాక్టర్ 4MM స్టీల్తో పని కానిచ్చేశారని చెప్పారు. దగ్గరి నుంచి చూస్తే అన్నీ సొట్టలే కనిపిస్తున్నాయని.. ఆర్నెళ్లలో మరిన్ని సొట్టలు పెరుగుతాయని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 1,569 మంది అమరులయ్యారని.. అమరవీరుల స్మారకంలో వారి పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు రేవంత్రెడ్డి. అమరవీరుల పేర్లు లేనప్పుడు.. శిలాఫలకాలపై మాత్రం కేసీఆర్ పేరు ఎలా పెడతారని నిలదీశారు. వందలాది మంది వీరుల త్యాగాలను కేసీఆర్ కాలగర్భంలో కలిపేశారని.. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ ఉద్యమ చరిత్రగా చూపిస్తున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. 2023 డిసెంబర్ 9న అమరవీరుల స్థూపంపై 1,569 మంది పేర్లను సువర్ణ అక్షరాలతో లిఖిస్తామని.. అమరవీరుల పేర్లు చదవిన తర్వాతే.. విజిటర్స్ లోనికి వెళ్లేలా నిబంధన పెడుతామని చెప్పారు. తెలంగాణ తొలి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ ఓ తీర్మానం ప్రవేశపెట్టారని.. అమరుల కుటుంబానికో ఉద్యోగం.. రూ.10లక్షల ఆర్థికసాయం.. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామన్నారని.. అవి ఏమైయ్యాయన్నారు రేవంత్రెడ్డి.