Congress News Telangana(ts politics): తెలంగాణకి మంచి రోజులు రాబోతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా చేరికలు ఉంటాయన్నారు. ఈ చేరికలు సాధారణమైనవి కావని.. సమిష్టి పోరాటంతో తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసువస్తామన్నారు.
రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బిగ్ డే. ఉదయం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇంటికెళ్లారు రేవంత్. మనం మనం కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని చర్చించుకున్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికెళ్లారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అక్కడే అంతా కలిసి లంచ్ మీటింగ్ నిర్వహించారు.
అటునుంచి రేవంత్, కోమటిరెడ్డిలు కలిసి.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంటికెళ్లారు. ఆయన్ను కాంగ్రెస్లో చేరాలని కోరారు. కేసీఆర్, బీఆర్ఎస్పై పోరాటానికి కాంగ్రెస్సే సరైన వేదికని వివరించారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పొంగులేటి అంగీకరించారు.
రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి, జూపల్లి.. బలమైన నాయకుల అరుదైన కలయికతో.. కాంగ్రెస్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైంది. ఇదే జోష్తో ముందుముందు మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తోంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ.. హస్తం పార్టీతో చేతులు కలిపేందుకు ముందడుగు వేస్తున్నాయి.
అయితే, నల్గొండ జిల్లా చేరికలే కీలకంగా మారనున్నాయి. వేముల వీరేశం తదితరులు పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, కొందరి విషయంలో.. కొందరు సీనియర్లు అభ్యంతరం చెబుతున్నట్టు తెలుస్తోంది. చేరికల విషయంలో ఎలాంటి వివాదాలు లేవన్నారు రేవంత్ రెడ్డి. నల్గొండలో చేరికల విషయంలో కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్తో చర్చించిన తర్వాతే పార్టీలోకి చేరుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్.