BRS MLA Rajaiah vs Sarpanch Navya(Telangana news updates) :స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వివాదాలు వెంటాడుతున్నాయి. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య మరోసారి సంచలన విషయాలు బయటపెట్టారు. ఎమ్మెల్యే మనుషులు తన భర్తను ట్రాప్ చేసి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. రాజయ్య తనను ఇబ్బంది పెట్టిన మాట నిజమేనని మరోసారి స్పష్టం చేశారు. అందుకే అప్పట్లో క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు.
పంచాయితీ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తామంటూ ఎమ్మెల్యే రాజయ్య నమ్మించి మోసం చేశారని ఆరోపించారు సర్పంచ్ నవ్య. నిధులు ఇవ్వాలంటే.. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు కావాలనే చేశానని ఒప్పుకోవాలంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను ట్రాప్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ మహిళ తనను బాగా ఇబ్బంది పెట్టిందని వెల్లడించారు.
ఎమ్మెల్యే, ఆయన పీఏ, మధ్యవర్తిగా ఉన్న మహిళ మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయని.. ఎప్పటికైనా బయటపెడతాననే భయంతోనే తన భర్త ప్రవీణ్ ను వాళ్లు ట్రాప్ చేశారని నవ్య అంటున్నారు. సంతకం పెట్టిస్తే డబ్బులు ఇస్తానని చెప్పి తన భర్తను నమ్మించారని తెలిపారు. ఆ మాటలు నమ్మి వాళ్లు తయారు చేసిన పేపర్లపై సంతకం పెట్టాలని తన భర్త ఒత్తిడి తెస్తున్నాడని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి తన ఇంట్లో చిచ్చు పెట్టారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, ఆయన పీఏ, మధ్యవర్తి లేడీతోపాటు ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు తన భర్తపై కూడా సీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.