Revanth Reddy news today(Breaking news updates in telangana): తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు మారుతోంది. సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరతారని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే బుధవారం పొంగులేటి నివాసానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంఛనమే. రెండు రోజుల క్రితం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న పొంగులేటి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు.
ఈ నెల 22న ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ వారిని ఆహ్వానించారు. హస్తిన వెళ్లేందుకు పొంగులేటి, జూపల్లి సిద్ధమైయ్యారు.ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మరోవైపు పొంగులేటితో సన్నిహతంగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం ఢిల్లీకి తీసుకెళ్లాలనే విషయంపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్లో చేరికల జోష్ కన్పిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి నేతలను హస్తం గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఈ నెల చివరి వారంలో భారీగా చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి కూడా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ ను వీడిన నాయకులను ఘర్ వాపసీ పేరుతో తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.