Soyam bapu rao news(Telangana BJP News): బీజేపీ నేతలు తెగ నీతులు చెబుతుంటారు. తాము సచ్చీలురమని, అవినీతి రహిత పాలన అందిస్తామని.. గొప్పలు పోతుంటారు. ప్రధాని మోదీ నిజాయితీకి మారు పేరు కావొచ్చు. అలాగని ఆ పార్టీ నాయకులంతా హానెస్ట్ అని చెప్పలేం. ప్రతిపక్షాలు విమర్శించడం కాదు.. తాజాగా బీజేపీ ఎంపీ సోయం బాపురావు తాను చేసిన ఘనకార్యాన్ని ఘనంగా చెప్పుకొచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు.. ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయిస్తుంది. ఏడాదికి 5 కోట్లు చొప్పున పెద్ద మొత్తమే ఇస్తుంది. ఆ నిధులతో సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు చాలామంది ఎంపీలు. అందులో బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఒకరు. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించడం మరింత ఆసక్తికరం.
ఇటీవల బీజేపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో తన ఇంట్లో అంతర్గత సమావేశం నిర్వహించారు. అంతా మనోళ్లేననే ధీమాతో.. ఉన్నదున్నట్టు మాట్లాడేశారు. ఆ మాటలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. ఎంపీ ల్యాడ్స్ నిధులతోనే తాను ఇల్లు కట్టుకున్నానని.. ఆ ఫండ్స్తోనే కొడుకు పెళ్లి కూడా చేశానని ఓపెన్గా చెప్పేశారు. పైగా, ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. ఎంపీగా తనకంటూ సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదనే ఉద్దేశంతోనే.. ఆ నిధులతో ఇల్లు కట్టుకున్నానని సమర్థించుకున్నారు కూడా. గత ఎంపీల మాదిరిగా.. తానేమీ నిధుల గోల్మాల్ చేయలేదని రివర్స్ అటాక్ కూడా చేశారు.
ఎంపీ బాపురావు మాట్లాడిన వీడియో ఫుల్ వైరల్ కావడంతో.. ఆయన స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ వాడుకున్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కొందరు కావాలనే తనపై కుట్ర చేస్తున్నారంటూ.. సొంత పార్టీ నేత రమేష్ రాథోడ్పై విమర్శలు గుప్పించారు. ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అటు, ఎంపీ సోయం బాపురావు కామెంట్లను రమేష్ రాథోడ్ తప్పుబట్టారు. బాపురావుపై కుట్రలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను ఎంపీ సీటు కోసం బీజేపీలోకి రాలేదని.. ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే పార్టీలో చేరినట్టు చెప్పారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకున్నానని ఆయనే చెప్పి.. కుట్ర చేశారంటూ మళ్లీ తనపై విమర్శలు చేయడం తగదన్నారు.