Bandi Sanjay latest speech(BJP news telangana): బండి రూట్ మారింది. బీజేపీ స్టాండ్ మారినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కేసీఆర్ను తిట్టుడు.. కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపిస్తాననుడు. ఇలానే సాగింది బీజేపీ రాజకీయం. కానీ, కర్నాటక ఫలితాల తర్వాత, పార్టీలో ఈటల రాజేందర్ వెయిట్ పెరిగాక.. సడెన్గా బండి సంజయ్ డైలాగుల్లో తేడా వచ్చింది. బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్పై వాయిస్ పెంచేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే.. ధరణిని కొనసాగిస్తాం. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటినీ కంటిన్యూ చేస్తాం. బండి సంజయ్ చేస్తున్న సంచలన స్టేట్మెంట్స్ ఇవి. ఏమైంది? సడెన్గా ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏంటి? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ డిస్కషన్.
కేసీఆర్ మీద బండికి ఇప్పటికిప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందని అనుకోలేం. మరెందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే.. కాంగ్రెస్ను కార్నర్ చేసేందుకే అంటున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని రేవంత్ అంటుండటం వల్ల.. కాంగ్రెస్కు అగెనెస్ట్గా బండి ఈ వ్యాఖ్యలు వదులుతున్నారని చెబుతున్నారు. సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తామని చెబుతూ.. మరో అడుగు ముందుకేశారు. అయితే, ఇక్కడే ఏదో తేడా కొడుతోందని అంటున్నారు.
ఉచితాలకు బీజేపీ మొదటినుంచీ తీవ్ర వ్యతిరేకం. ప్రధాని మోదీనే పలుమార్లు ఉచితాలపై ఘాటైన విమర్శలు చేశారు. అలాంటిది కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తామని బండి సంజయ్ చెబుతుండటం.. ఉచితాలను సమర్థించినట్టేగా? మరి, బండి మాటలు ఆయన వ్యక్తిగతమా? బీజేపీ అభిప్రాయమా? అధిష్టానం అనుమతితోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా? లేదంటే, పార్టీ అధ్యక్షుడి హోదాలో సొంతంగా ప్రకటనలు ఇస్తున్నారా? ఈటల వల్ల పార్టీలో అభద్రతా భావం పెరిగి.. ఇలాంటి వ్యాఖ్యలతో యాక్టివ్ కావాలని అనుకుంటున్నారా? కర్నాటక ఫలితాల తర్వాత.. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్సే.. బీజేపీకి మెయిన్ టార్గెట్గా మారిందా? ఆ మేరకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయా? అందుకే, బండి సంజయ్ నోటినుంచి కొత్త డైలాగ్స్ వినిపిస్తున్నాయా? ఇలా అనేక ప్రశ్నలు.
అక్కడితో ఆగిపోలేదు బండి సంజయ్. కాంగ్రెస్లో 30 మందికి కేసీఆరే టికెట్లు ఇస్తారని.. వారంతా గెలిస్తే తిరిగి బీఆర్ఎస్లో చేరుతారంటూ.. మైండ్ గేమ్ పాలి..ట్రిక్స్ చేస్తున్నారు బీజేపీ చీఫ్. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని.. ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం మర్చిపోయారా అంటూ పంచ్లు విసురుతున్నారు. టీపీసీసీ కళంకిత నాయకులు గాలిలో కోటలు కడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ట్రైలర్లోనే కనిపిస్తుందని బండి సంజయ్ విమర్శల డోస్ పెంచారు. హిందువులపై మతమార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేశారని.. హెడ్గేవార్, సావర్కర్ చరిత్రలను తీసేసి ఒసామా బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులపై చాప్టర్లు చెబుతారా? అని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ బియ్యం పంపిణీ పథకం చాలా లోపభూయిష్టంగా ఉందంటూ తప్పుబడుతున్నారు. ఇలా కొన్నిరోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శలన్నీ కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతుండటం పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తోంది.