YS Sharmila latest news(Telangana today news): వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న నాయకురాలు. వైఎస్ఆర్టీపీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలపై ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాన్ని రేపాయి. ఆ తర్వాత షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే నిత్యం ఏదో ఒక సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అనేక వివాదాలు ఆమెను చట్టుముట్టాయి.
ఈ మధ్యకాలంలో షర్మిల కాస్త దూకుడు తగ్గించారు. వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తుందని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే స్వాగతిస్తామన్నారు.
తాజాగా షర్మిల రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తిని రేపుతోంది. రాహుల్ ఆయురారోగ్యంతో సంతోషంగా జీవితం సాగించాలని ఆకాంక్షిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఎంతో ఓర్పుతో రాహుల్ చేస్తున్న ప్రజా సేవ ఎంతోమందికి స్ఫూర్తి దాయకమన్నారు. నిరంతరం ప్రజాసేవ కొనసాగాలని కోరుతూ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
తాజా పరిణామాల నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ లోకి వస్తారనే వార్తలు మళ్లీ బలంగా వినిపిస్తున్నాయి. మరి షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..? ఏపీ బాధ్యతలు అప్పగిస్తే తీసుకుంటారా..? ఈ విషయంపై షర్మిలనే క్లారిటీ ఇవ్వాలి మరి.