Professor Haragopal news(Breaking news updates in telangana): తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. కేసుల ఎత్తివేతపై డీజీపీ అంజనీకుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న వారిని నిరోధించేందుకు UAPA యాక్ట్ తీసుకొచ్చారు. హరగోపాల్తోపాటు 152 మందిపై ఈ చట్టం కింద దేశద్రోహం కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు విషయం బయటకు రాగానే.. తెలంగాణ సమాజం నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద హరగోపాల్తోపాటు 152 మందిపై కేసు నమోదు చేశారు. ఆయనపై ఆర్మ్స్ యాక్ట్ తోపాటు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ దేశద్రోహం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది.
పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళిని 2 నెలల కిందట పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనపై మరికొన్ని కేసులు ఉన్నాయని బెయిల్పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు వివరించారు. ఆ కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించిన సమయంలో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని పోలీసులు అంటున్నారు. ప్రజాప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు.
తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామం వద్ద ఓ రోజు మావోయిస్టులు సమావేశామవుతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అక్కడ పోలీసులకు విప్లవ సాహిత్యంతోపాటు కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఆ పుస్తకాల్లో ప్రముఖుల పేర్లు ఉన్నాయి. దీంతో వారిని నిందితులుగా చేర్చారు.
మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో సర్కారు ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు అభియోగాలు మోపారు. ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేశారని, యువతను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం లాంటి పనులు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రమౌళితోపాటు నిందితులుగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ పద్మజా షా, చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునాథ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్ పేర్లు ఉన్నాయి.
మరోవైపు ప్రొఫెసర్ హరగోపాల్ పై ఉపా కేసు ఎత్తివేతపై ములుగు జిల్లా ఎస్పీ ప్రకటన జారీ చేశారు. గడ్డం లక్ష్మణ్, పద్మజా షా, చిక్కుడు ప్రభాకర్, రఘునాథ్, సురేశ్ పై కూడా కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. న్యాయపరంగా కోర్టులో మెమో దాఖలు చేస్తామని చెప్పారు.