Political News in Telangana: తెలంగాణలో రాజకీయ పార్టీల సమీకరణాలు మారుతుండడంతో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. బీజేపీలో అంతర్గత విబేధాలు తారస్థాయిలో ఉండడం, అమిత్ షా పర్యటనతో వాటికి పరిష్కారం దొరుకుతుందనుకుంటే.. పర్యటన కాస్తా వాయిదా పడింది. మరోవైపు ముగ్గురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు టార్గెట్ గా ఐటీ దాడులు ఏకకాలంలో జరగడం చర్చనీయాంశంగా మారింది. అటు టీ కాంగ్రెస్ లో చేరికలు జోష్ నింపుతున్నాయి.
తెలంగాణ బీజేపీలో నేతలు ఎవరికి వారే భేటీలు నిర్వహించుకుంటున్నారు. పార్టీలో అసలేం జరుగుతోంది తెలియడం లేదంటూ సీనియర్లు వాపోతున్న పరిస్థితి. పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్న విషయాన్ని అమిత్ షా గ్రహించారు. అందుకే ఖమ్మంలో సభ ఉన్నా.. హైదరాబాద్ లోనూ ముఖ్య నేతలతో భేటీకి ప్లాన్ చేసుకున్నారు. అది కాస్తా రద్దవడంతో నేతల మధ్య విబేధాలను ఎప్పుడు ఎవరు పరిష్కరిస్తారన్న డౌట్లు పెరుగుతున్నాయి. నిజానికి గతంలో చేవెళ్ల సభకు అమిత్ షా వచ్చినప్పుడే అంతర్గత కలహాలపై నేతలకు క్లాసులు తీసుకున్నారు షా.
మరోవైపు బీజేపీలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్ పూర్తిగా సైలెన్స్ పాటిస్తున్నారు. షా పర్యటనకు ముందే ఈటలకు కీలక పదవి అంటే బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ లేదంటే మరో పదవి వస్తుందని ప్రచారమైతే జోరుగా సాగింది. కానీ ఇప్పుడు అవేవీ ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఒకవైపు బీజేపీలో చేరికలు లేవు… ఉన్నవారిలోనూ అసంతృప్తి.. ఇప్పుడు అమిత్ షా పర్యటన వాయిదాతో కమలం పార్టీలో గందరగోళం కంటిన్యూ అవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆర్నెళ్ల టైం మాత్రమే ఉంది. అయితే ఉన్నట్లుండి ఏకకాలంలో ముగ్గురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిల నివాసాలు, వ్యాపార సంస్థల్లో దాదాపు 60 చోట్ల 70 టీములు సోదాలు చేయడం రాజకీయంగా ఉత్కంఠగా మారింది. తాము మొదటి నుంచే వ్యాపారంలో ఉన్నామని, ఇవాళ కొత్తగా వచ్చిందని కాదని, ప్రతి ఆస్తికి లెక్క చెబుతామని అంటున్నారు. ఎలక్షన్ల ముందు బద్నాం చేయడమే అంటూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంటే.. టీ కాంగ్రెస్ లో మాత్రం చేరికల జోష్ కంటిన్యూ అవుతోంది. నిర్మల్ కు చెందిన శ్రీహరిరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో నిశబ్ద విప్లవం వస్తుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి హస్తం గూటివైపు టర్న్ అవడంతో ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది. మొత్తంగా తెలంగాణలో ప్రధాన పార్టీల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.