IIIT basar latest news(Today breaking news in Telangana): బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యలు ఆగడంలేదు. రెండురోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. ఈ ఘటనలపై ట్రిపుల్ ఐటీ యాజమాన్యం భిన్న వివరణలు ఇస్తోంది.
రెండురోజులు క్రితం పీయూసీ ఫస్టియర్ విద్యార్థిని దీపిక ఉరి వేసుకుంది. గురువారం వేకువజామున 2 గంటల సమయంలో పీయూసీ మొదటి ఏడాది విద్యార్థి లిఖిత వసతి గృహం 4వ అంతస్తు నుంచి కిందపడింది. ఆమెది ఆత్మహత్యా? లేక ప్రమాదమా అనే విషయంలో స్పష్టత రాలేదు. ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదమని చెబుతున్నారు. యూట్యూబ్ చూస్తూ ప్రమాదవశాత్తు కిందపడిందని వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ ప్రకటించారు. అటు సెక్యూరిటీ విభాగం మాత్రం బిల్డింగ్లోకి కుక్క ప్రవేశించి దాడికి చేసేందుకు యత్నించడంతో లిఖిత పరుగెడుతూ కిందపడి చనిపోయిందని చెబుతోంది. విద్యార్థులు చనిపోతున్న తీరు, యాజమాన్యం ఇస్తున్న వివరణలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన బుర్ర రాజు, రేణుక దంపతుల పెద్ద కుమార్తె లిఖిత . మిర్చిబండి నిర్వహిస్తూ రాజు పిల్లలను చదివిస్తున్నారు. వారం రోజుల క్రితమే హాస్టల్ చేరిన తమ కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇక బాసర ట్రిపుల్ ఐటీలో 15 సంవత్సరాలలో 27 మంది సూసైడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు విద్యార్థులు బలైయ్యారు. ఈ ఆరు నెలల్లో రాథోడ్ సురేష్, భానుప్రసాద్, దీపిక, లిఖిత ఆత్మహత్య చేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ అడ్మినిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయం లోపం కారణంగా అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా వీసీ క్యాంపస్లోనే ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో ఉండాలి. ఆయన అందుబాటులో లేకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు, విద్యార్థులకు సంబంధించిన అంశాలపై ఆరా తీసిందే లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
అన్ని విషయాల్లో తన ఆధిప్యతం కోసం విద్యార్థులు, సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వీసీపై వినిపిస్తున్నాయి. అటు క్యాంపస్లో విద్యార్థుల ఆత్మహత్యలపై పీఆర్వో స్పందించకపోవడం చర్చకు దారి తీస్తోంది. పీఆర్వోను సంప్రదిస్తే వీసీతో మాట్లాడాలంటూ చేతులు దులుపుకున్నారనే చర్చ జరుగుతోంది.
అసలు క్యాంపస్లో ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి ఉంటోంది. బయటి వ్యక్తులపై మాత్రమే కాకుండా మీడియాపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైన కూడా క్యాంపస్ నుంచి వెళ్లేందుకు వీల్లేదని, వారికి అనుమతి నిరాకరిస్తున్నారే వాదనలు వినిపిస్తున్నాయి.
సెక్యూరిటీ సిబ్బంది సైతం ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యార్థులపై ఒత్తిడి తేవడం కూడా ఒక కారణం. విద్యార్థులు కాస్త రిలాక్స్ అయ్యేందుకు కనీసం బయటికి వెళ్లలేని పరిస్థితి. దీనిని బట్టి అక్కడ వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ట్రిపుల్ ఐటీలో ఎలాంటి ఘటనలు జరిగినా గోప్యంగా ఉంచడం యాజమాన్యానికి అలవాటైంది.