Revanth Reddy latest news(Breaking news updates in telangana): ధరణిని ఆంధ్రా రాజుకు.. తెలంగాణ యువరాజు కట్టబెట్టారని ఆరోపించారు రేవంత్రెడ్డి. ధరణి వెనుక రాజులు, దొరలు ఉన్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లు అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లుగా మారారని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంతటి దోపిడీ ఎక్కడా జరగలేదని.. ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు. ధరణితో దేశ భద్రతకే ముప్పు వాటిల్లిందని మండిపడ్డారు రేవంత్రెడ్డి.
ధరణి పోర్టల్ బాధ్యత ప్రైవేట్ సంస్థ చూస్తోందని.. ఆ సంస్థ జాతీయ బ్యాంకులను రూ.90వేల కోట్లకు ముంచిందని.. దివాళా తీసిన కంపెనీతో ప్రభుత్వం 150 కోట్లకు ఒప్పందం చేసుకుందని రేవంత్ చెప్పారు. తెలంగాణ భూముల వివరాలన్నింటినీ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారన్నారు. ధరణి పోర్టల్ను ఇన్ఫ్రాస్టక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్-ILF అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఐఎల్ఎఫ్లో ఫిలిప్పీన్కు చెందిన కంపెనీకి పెట్టుబడులు ఉన్నాయి. ఐఎల్ఎఫ్లో 99శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఆ కంపెనీ హైదరాబాద్లో ఉంటుందని.. అది శ్రీధర్రాజుకు చెందిన కంపెనీ అని వివరించారు రేవంత్రెడ్డి. ఆ శ్రీధర్రాజు.. కేటీఆర్కు బాగా కావలసినవాడని అన్నారు.
70 లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్ఎఫ్ సంస్థకు అమ్మేశారని.. ధరణి ద్వారా మన సమాచారం దేశ సరిహద్దులు దాటిపోతోందన్నారు రేవంత్రెడ్డి. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు కట్టిన డబ్బులు.. ప్రభుత్వ ఖాతాలోకి కాకుండా ఆ ప్రైవేట్ సంస్థ అకౌంట్లోకే డబ్బులు చేరుతున్నాయని అన్నారు. డబ్బులు కట్టాక రిజిస్ట్రేషన్ కాకుంటే.. రీఫండ్ చేయట్లేదని.. అది మరో మోసమన్నారు. ఇప్పటి వరకూ జరిగిన ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని.. కేంద్రం కాగ్ నివేదిక కోరాలని.. డిమాండ్ చేశారు. భరించలేని స్థాయిలో కేసీఆర్ దుర్మార్గాలున్నాయని రేవంత్రెడ్డి మండిపడ్డారు.