Vikarabad news today(Latest news in telangana): వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన శిరీష అనే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు ఓ కొలిక్కి వచ్చింది. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. మొదటి నుంచీ ఈ కేసు బావ చుట్టూనే తిరుగుతోంది. చివరికి అతనే నిందితుడిగా తేలాడు. మూడు రోజులుగా పోలీసుల ఎదుట అనిల్ నోరు మెదపడం లేదు. అనిల్ కాల్ డేటా ఆధారంగా అతని ఫ్రెండ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపడంతో అసలు కథ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీషతో అనిల్ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో శిరీష మరో రూంలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆగ్రహించిన అనిల్ రూమ్ గడియ విరగొట్టి శిరీషను బయటకు తీసుకొచ్చి కొట్టాడు. శిరీషపై చేయి చేసుకున్న తర్వాత అనిల్ పరిగి వెళ్లిపోయాడు. మనస్థాపానికి గురైన శిరీష ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ విషయం శిరీష తమ్ముడు.. అనిల్ కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే తన మిత్రుడితో కలిసి అనిల్ ఫుల్గా మద్యం తాగి ఉన్నాడు. మరో బీర్ తీసుకొని ఫ్రెండ్ తో కలిసి కాడ్లాపూర్ వచ్చాడు. ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర అతనికి శిరీష కనిపించింది. ఆమెను చూడగానే ఆవేశపడిన అనిల్.. శిరీషను మళ్లీ కొట్టాడు. అక్కడే ఉన్న కుంటవైపు లాక్కెళ్లి.. వెంటతెచ్చుకున్న బీరు బాటిల్ను పగుల గొట్టి.. అనిల్ తన ఫ్రెండ్తో కలిసి.. శిరీష కళ్లల్లో కిరాతకంగా పొడిచారు.
తనను వదిలేయండి అంటూ శిరీష ఎంత ప్రాధేయపడినా ఆ క్రూరులు వదల్లేదు. మోకాలు లోతు నీళ్లున్న కుంటలోకి శిరీషను ఇద్దరూ కలిసి విసిరేశారు. శిరీష చనిపోయే వరకూ.. ఆమెపై అనిల్ ఫ్రెండ్ నిలుచున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఎవరి దారిన వారు వెళ్లి పోయారు. ఆ తర్వాత ఏం తెలీనట్టు శిరీష కోసం వెతుకుతున్నట్టు నటించారు. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.