Kothakota Dayakar Reddy news(Telangana news updates) : టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకుజామున తుదిశ్వాస విడిచారు.
దయాకర్ రెడ్డి టీడీపీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1994,1999 అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం నుంచి విజయకేతనం ఎగురవేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో మక్తల్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దయాకర్ రెడ్డి విజయం సాధించారు.ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.
కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం. ఆయన భార్య సీతాదయాకర్ రెడ్డి రాజకీయాల్లోనే ఉన్నారు. ఆమె కూడా ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఆమె దేవరకద్ర నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఏడాది ఆగస్టులో దంపతులిద్దరూ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరిగింది. మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా గత కొంతకాలంగా రాజకీయాలకు దయాకర్ రెడ్డి దూరంగా ఉంటున్నారు.