YS Jagan meeting today live(AP political news) : ఏపీ సీఎం జగన్ నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రారంభించారు. తొలుత విద్యార్థులతోపాటు తరగతి గదిలో కూర్చున్నారు. కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.217 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇక్కడ నిర్వహించిన సభలో విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు.
శనివారం శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆదివారం విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వం చేసిన విమర్శలకు జగన్ సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చని అన్నారు. తాను బీజేపీని
నమ్ముకోలేదని స్పష్టం చేశారు. కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలే తన సైన్యమని తేల్చిచెప్పారు. ప్రజలకు మంచి జరిగిందా? లేదా? అనేదే కొలమానంగా తీసుకోవాలని ఓటర్లను కోరారు. మంచి జరిగితే తనకు అండగా నిలవాలన్నారు.
చంద్రబాబుపైనా మరోసారి జగన్ ఫైర్ అయ్యారు. మోసాల చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రమని విమర్శించారు. బాబు పెత్తందారీ భావజాలానికి.. పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. టీడీపీ హయాంలో దోచుకో, పంచుకో, తినుకో విధానం కొనసాగిందన్నారు.
దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందని జగన్ విమర్శించారు . మహానాడులో టీడీపీ విడుదల చేసిన తొలిదశ మేనిఫెస్టోపైనా సెటైర్లు వేశారు. చంద్రబాబు పులిహోర మ్యానిఫెస్టో తెచ్చారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఏం చేశారని జగన్ ప్రశ్నించారు.
ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. తాజాగా ఢిల్లీలో అమిత్ షాను చంద్రబాబు కలిశారు. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దిశ ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయని టాక్. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. తొలి నుంచి సింగిల్ గానే పోటీ అంటూ జగన్ స్పష్టం చేస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీ, జనసేనపై మాత్రమే విమర్శలు గుప్పించే జగన్ ..తాజా ఆ జాబితాలో బీజేపీని చేర్చారు.