Amit Shah news latest(Political news in AP): విశాఖలో బీజేపీ మహా సంపర్క అభియాన్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. 9 ఏళ్ల మోదీ పాలనలో సాధించిన విజయాలను వివరించారు. మోదీ ప్రధాని అయ్యాక సైనిక బలం పెరిగిందన్నారు. పుల్వామా ఘటనకు 10 రోజుల్లో సమాధానం చెప్పామని తెలిపారు. సర్జరికల్ స్ట్రైక్ తో పాక్ కు బుద్ధి చెప్పామన్నారు. మోదీ పాలనలో అవినీతి జరగలేదని తెలిపారు. యూపీఏ హయాంలో అన్ని కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. ఆ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్లు దోచుకున్నారని అమిత్ షా ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటోందని కానీ నాలుగేళ్ల లో అవినీతి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అమిత్ షా విమర్శించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానంలో ఏపీ ఉందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన డబ్బులనే రైతుభరోసా పేరుతో సీఎం జగన్ పంచుతున్నారని చెప్పారు. ఇందుకు జగన్ సిగ్గపడాలని మండిపడ్డారు.
రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం కేంద్రం ఇచ్చినవేనని అమిత్ షా తెలిపారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం పథకంపై జగన్ తన ఫోటో పెట్టుకున్నారని విమర్శించారు. 2024లో మోదీ మళ్లీ ప్రధాని అయ్యేందుకు ఏపీ ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. 20 ఎంపీ సీట్లు గెలిపించాలని ఓటర్లను కోరారు.