Apsara Murder Case Hyderabad(Today breaking news in Telangana): హైదరాబాద్ సరూర్నగర్లో సంచలనం సృష్టించిన అప్సర మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన పూజారి సాయికృష్ణను పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. సాయికృష్ణపై 302, 301 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అప్సర హత్య కేసులో పోస్ట్మార్టం రిపోర్టు కీలకంగా మారింది. ఉస్మానియా మార్చురీలో అప్సర మృతదేహానికి వైద్యులు పోస్ట్మార్టం చేశారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తలకు బలమైన గాయాలు కావడం వల్లే అప్సర మృతి చెందిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రాథమికంగా తేలింది. అప్సర గర్భవతి కాదని తేల్చారు. అయితే కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని అప్సర తల్లి ఆరోపిస్తున్నారు.
రిమాండ్ రిపోర్ట్లో పలు విషయాలు ప్రస్తావించారు పోలీసులు. గతేడాది ఏప్రిల్లో సరూర్ నగర్ బంగారు మైసమ్మ ఆలయంలో పూజారి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వాట్సాప్ చాటింగ్ పెరిగింది. ఆర్నెళ్ల క్రితం వారిద్దరూ కలిసి.. గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్, ద్వారక ఆలయం వెళ్లారు. అప్పటి నుంచీ వారి బంధం మరింత బలపడింది. పరస్పరం వాట్సాప్లో ఐ లవ్ యూ చెప్పుకున్నారు. కొంతకాలం తర్వాత తనను పెళ్లి చేసుకోమని అప్సర ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేసింది. పెళ్లి చేసుకోకపోతే.. బజారుకు ఈడుస్తానంటూ బ్లాక్మెయిల్ చేసింది. ఇదేదో తేడా కొట్టేలా ఉందనుకున్న సాయికృష్ణ.. అప్సరను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు.
హత్యకు వారం రోజుల ముందు ‘మనిషిని చంపడం ఎలా?’ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు సాయికృష్ణ. పక్కా ప్లాన్ ప్రకారం కోయంబత్తూరు తీసుకెళ్తానని నమ్మించి.. శంషాబాద్కు, సుల్తాన్పల్లిలోని గోశాలకి తీసుకెళ్లి.. దారుణంగా చంపేశాడు.. అంటూ రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
హత్య తర్వాత అప్సర డెడ్ బాడీని సరూర్ నగర్ తీసుకొచ్చి సెప్టిక్ట్యాంక్లో పడేశాడు. దుర్వాసన రాకుండా బస్తా ఉప్పును అందులో పోశాడు. అంతేకాదు ఓ ట్రక్కు ఎర్రమట్టిని పోయించాడు. మరుసటి రోజు మ్యాన్ హోల్ దగ్గరకు వెళ్లిన సాయికృష్ణకు దుర్వాసన రావడంతో సిమెంట్తో ఆ సెప్టిక్ట్యాంక్ను మూసివేశాడు. కానీ సీసీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.