Fish Medicine(Hyderabad latest news in telugu): హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో.. చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. చేపమందు పంపిణీ రెండు రోజుల పాటు కొనసాగనుంది. బత్తిని బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రసాదాన్ని స్వీకరించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు.. పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. హర్యాన, ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర తో పాటు.. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. చేపమందు ప్రసాదం అస్త్మా, ఉబ్బసం రోగాల నుంచి.. ఊరటనిస్తుందని విశ్వసిస్తారు.
మరోవైపు చేప మందు ప్రసాదం పంపిణీ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా మూడేళ్లు వాయిదా పడ్డ ప్రసాదం పంపిణీని ఈ సారి పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఏర్పాట్లను పర్యవేక్షించారు. 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు చేపమందు ఎవరైనా వేసుకోవచ్చని.. గర్భిణులు మాత్రం తీసుకోవద్దని బత్తిని బ్రదర్స్ తెలిపారు.
ఇక చేపమందు ప్రసాదం తయారీ, అందుకు కావాల్సిన చేప పిల్లలను ఇప్పటికే సిద్ధం చేశారు. దాదాపు 5 లక్షల మందికి సరిపడా 5 క్వింటాళ్ల చేప ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. మత్స్యశాఖ ఇప్పటికే రెండున్నర లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసింది. మరోవైపు శాఖాహారులు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. చేపపిల్లల స్థానంలో.. బెల్లంతో కలిపి ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చని.. నిర్వాహకులు తెలిపారు. పరగడుపున లేదా భోజనం చేసిన మూడు గంటల తర్వాత చేపమందు తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రెండు రోజుల ప్రసాదం పంపిణీ తర్వాత.. పాతబస్తీలోని తమ నివాసంలో చేప ప్రసాదం అందుబాటులో ఉంటుందని.. బత్తిని బ్రదర్స్ తెలిపారు.