Telangana congress news(TS Politics): కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అదే జోష్ తో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. అంతకంటే ముందు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆ ఐదు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో గెలిచి సార్వత్రిక సమరానికి సిద్ధం కావాలని భావిస్తోంది.
కర్ణాటక విక్టరీ ఎఫెక్ట్ తెలంగాణపై బాగా ఉంది. ఇక్కడ బీజేపీలో దూకుడు తగ్గింది. కాషాయ పార్టీ ఉనికే ప్రశ్నార్థంగా మారే పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. హస్తంతో చేతులు కలిపేందుకు నేతలు క్యూలు కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కే ఎక్కువ పడతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పరంగా బలంగానే ఉంది. కానీ అందుకు తగ్గట్టే సీట్లు రాలేదు. కానీ ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందుకే త్వరలో ఢిల్లీలో ఎన్నికల వ్యూహంపై చర్చించాలని భావిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి స్వదేశానికి రాగానే తెలంగాణ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా ఈ భేటీలో పాల్గొంటారని సమాచారం .టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కొంతమంది సీనియర్ నేతలు, ఏఐసీసీ కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి రాష్ట్ర నాయకత్వానికి రోడ్ మ్యాప్ ఇస్తారని అంటున్నారు.