TDP Mahanadu Rajahmundry Meeting(Latest news in Andhra Pradesh): ఆంధ్రప్రదేశ్లో జరగనున్న TDP మహానాడు ఈసారి ప్రత్యేకంగా నిలవనుంది. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ మహానాడు ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. మేనిఫెస్టోతో పాటుగా పొత్తులపైనా క్లారిటీ ఇవ్వనున్నారు. 15 లక్షల మందితో సభ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఏపీలో విజయమే లక్ష్యంగా తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. వైసీపీని ఎదుర్కొనేందుకు మహానాడును ఆయుధంగా మలుచుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించనున్న మహానాడుపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం కూడా కావడంతో టీడీపీ ఈ మహానాడు వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రాజమండ్రి పసుపుమయంగా మారింది. ఎటు చూసినా హోర్డింగులు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రిలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది.
మహానాడు వేదిక నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. మహానాడులో తొలి మేనిఫెస్టోను టీడీపీ ప్రకటించనుంది. ఇందులో మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చే అంశాలను పొందుపరచనున్నారని తెలుస్తోంది. దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం.
ఎన్నికల మేనిఫెస్టోతో పాటు జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో కూడా చెబుతారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే హామీలను కూడా ముందుగానే ప్రకటిస్తారని సమాచారం. ఈ మహానాడులో భాగంగా టీడీపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలే కీలకం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 19 అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ ఇన్ని స్థానాలు లేవు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహానాడుకు వేదికగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిని ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగా మే 27న పార్టీ ప్రతినిధుల సభ.. 28న మహానాడు బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు బలం చాటుకొనేలా 15 లక్షల మందితో నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.