Chandrababu: తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పోరుబాట చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని.. మూడు రోజుల్లో ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఇటీవల పశ్చిమగోదావరి పర్యటనలో ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్లైన్ విధించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోరుబాట పేరుతో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు పాదయాత్ర సాగింది.. సుమారు 12 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబు.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
రైతు పోరుబాట ప్రారంభమానికి ముందు ఇరగవరం ఆంజనేయస్వామి ఆలయంలో చంద్రబాబు పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రైతులను సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఫల్యంతోనే రైతులు రోడ్డెక్కారని.. తిరుగుబాటు చేస్తూ పోరాటానికి ముందుకొచ్చారన్నారు చంద్రబాబు.
కల్లాల్లోని ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేవరకు రైతుల పక్షాన పోరాడుతాని స్పష్టం చేశారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా.. రైతులంతా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. రైతు పోరుబాట, పాదయాత్ర.. వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.