Ponguleti Srinivas Reddy News(Telangana Politics): పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ పేరు కొంతకాలంగా తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుస ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి గులాబీ పార్టీలో గుబులు రేపారు. ప్రభుత్వంపై , పార్టీ అధిష్టానంపై నేరుగా విమర్శలు చేశారు. దీంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక ఆయన ఏ పార్టీలో చేరతారనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. తొలుత బీజేపీలో చేరతారని ప్రచారం సాగినా.. కాంగ్రెస్ కుండువా కప్పుకుంటానని సంకేతాలిచ్చారు.
తాజాగా ఖమ్మంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి తనబలమేంటో మరోసారి నిరూపించారు పొంగులేటి. ఈ సమావేశానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం హాజరుకావడం ఆసక్తిని రేపింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమాధి చేస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ ఆశయం కోసం తెలంగాణ బిడ్డలు కలలు గన్నారో అవి నెరవేరలేదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ వేలకోట్లు దోచుకుని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.
బీసీలకు లక్ష ఆర్థిక సాయమని కేసీఆర్ ప్రకటించడం ఎన్నికల ఎత్తుగడ అని పొంగులేటి పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో గుర్తుకురాని బీసీలు ఎన్నికల వేళ గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. మంత్రులే పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్న భూములను కొల్లగొట్టడానికి, వేలకోట్లు సంపాదించడానికే కేసీఆర్ ధరణిని తెచ్చారని విమర్శించారు.
ఖమ్మంకు చెందిన మంత్రి దోపిడీ అందరికీ తెలుసని, ఆయన అనుచరులు మట్టికొండలను సైతం వదిలిపెట్టడం లేదని పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఇలా ఈ ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలే ప్రధాన అంశంగా మారాయి. రాజకీయ భవిష్యత్తుపై మాత్రం పొంగులేటి ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు.
తెలంగాణలో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజలు పరిష్కారం కోరుకుంటున్నారనడానికి ఖమ్మం సభ ఒక సంకేతమని కోదండరాం అన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేలు ఇస్తామని చెప్పిన సర్కార్.. ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తెలంగాణను కాపాడుకోవడానికి అంతా ఒకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కోదండరాం పిలుపునిచ్చారు.
వందల మంది యువత బలిదానాలతో వచ్చిన తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కుట్రలు, కుతంత్రాలతో సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలా మొత్తంమీద ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలతో సాగింది. అటు పొంగులేటి కానీ ఇటు జాపల్లి కానీ తమ రాజకీయ కార్యాచరణ ఏంటో స్పష్టంగా చెప్పలేకపోయారు.