Kothagudem news today (Political news in Telangana): కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. దమ్మపేట మండలంలోని పట్వారిగూడెంలో జలగం వెంకట్రావు ఆత్మీయ సమావేశం పార్టీలో అలజడి రేపుతోంది. కొంతకాలంగా బీఆర్ఎస్ పై జలగం అనుచరులు ఆగ్రహంగా ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే కొత్తగూడెం టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం సీటు తమదంటే తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. అలా అయితే జలగం వెంకట్రావు పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలు పోటీ చేస్తారా లేదా? అని అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే జలగం ముఖ్య అనుచరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నా అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి.
జలగం వెంకట్రావు తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రకటన చేస్తారనే అంశం ఉత్కంఠ రేపుతోంది. 2014 ఎన్నికల్లో జలగం వెంకట్రావు కొత్తగూడెం నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో జలగం ఓడిపోయారు. ఆ తర్వాత వనమా కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కారెక్కారు. ఇప్పుడు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఈ నియోజకవర్గం నుంచే తన రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తున్నారు.
ఇప్పుడు ముగ్గురు నేతల మధ్య టిక్కెట్ పంచాయితీ గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. జలగం వెంకట్రావుకు టిక్కెట్ దక్కకపోతే పార్టీ మారడం ఖాయంటున్నారు ఆయన అనుచరులు. ఇదే ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో హాట్ టాఫిక్ గా మారింది.