Karnataka CM News(Congress News Latest): ఎట్టకేలకు కర్ణాటక సీఎం పదవి సిద్ధరామయ్యను వరించింది. పాలన అనుభవం, రాజకీయ దక్షత, పార్టీ అధిష్టానం పట్ల నిబద్ధత ఆ అర్హతలే సిద్ధరామయ్యను మరోసారి ముఖ్యమంత్రిని చేశాయి. వివాదరహిత పాలన, బలహీన వర్గాల సామాజిక నేపథ్యం కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపడానికి అదనపు బలాన్నిచ్చాయి.
75ఏళ్ల సిద్ధరామయ్య మరోసారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధీష్టించబోతున్నారు. 2013-18 మధ్య కాలంలో కర్ణాటక సీఎంగా పని చేసిన ఆయన గతానికి భిన్నంగా ఐదేళ్ల పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలోనే విద్య, వైద్యం తదితర రంగాల్లో ఆకర్షణీయ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. ఇవే సిద్దరామయ్యకు మాస్ లీడర్ గా పేరుతెచ్చాయి.
నిజానికి జేడీఎస్ లో బహిష్కరణను ఎదుర్కొన్న సిద్ధరామయ్య అనంతర కాలంలో కాంగ్రెస్ లో చేరారు. అనతికాలంలోనే కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి విధేయుడిగా పేరుపొందారు. 2014 తర్వాత మోడీ-షా ద్వయం చేపట్టిన హిందుత్వ, విభజన రాజకీయాల ప్రభావం కర్ణాటకపై పడకుండా నిలువరించగలిగారు. మత ప్రాతిపదిక రాజకీయాలను అడ్డుకునేందుకు రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ కు సిద్ధరామయ్య వ్యూహాలు పన్నారు. కర్ణాటకలోని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఏకతాటి మీదకు తీసుకొచ్చారు.
2018 ఎన్నికల ముందు కన్నడ రైతుల సమస్యలు, స్థానిక అంశాలతో బీజేపీని ఇరుకున పెట్టారు. మరోవైపు సిద్ధరామయ్య చేసిన సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే బీజేపీ 2018 ఎన్నికల్లో పూర్తి మెజార్టీని సాధించలేకపోయింది. అనంతర పరిస్థితుల్లో జేడీఎస్ తో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులోనూ సిద్ధరామయ్య చాణిక్యం పని చేసింది.
లింగాయత్, ఒకలిగ వంటి కుల సమీకరణలు కన్నడ రాజకీయాలు శాసిస్తున్న సమయంలోనూ సిద్దరామయ్య తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయన అన్ని వర్గాల వారికి చేరవయ్యారు. అందుకే, సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ నుంచి గట్టి పోటీ వచ్చినా.. సిద్ధరామయ్యకే జై కొట్టింది అధిష్టానం. కర్ణాటకకు కాబోయే సీఎంగా సిద్ధరామయ్య పేరు ప్రకటించగానే.. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయ్.