Breaking News in Telangana: కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ తెచ్చాయి. కన్నడ తీర్పు కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూశారు. అక్కడ హస్తం గెలుపు ఖాయమని నమ్మారు. వారి ధీమా ఫలించింది. కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో కూడా కర్ణాటకలో వచ్చిన ఫలితాలే వస్తాయని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసమే తెలంగాణలో చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేయాలని యోచించింది. కర్ణాటకలో గెలిస్తే పార్టీలో చేరికలు బాగా ఉంటాయని భావించింది. కమలం పార్టీ నేతల అంచనాలు తారుమారు అయ్యాయి. కన్నడ తీర్పు తర్వాత కాషాయ కండువా కప్పుకునేందుకు నేతలు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువే. ఇదే కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది. ఎందుకంటే కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరాలా? బీజేపీలో చేరాలా ? అనే డైలమాలో ఉన్నారు. ఇక అలాంటి నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలే ఎక్కువ. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ తొందరగా వినియోగించుకుంటే ఇక రాష్ట్రంలో మరింత బలపడటం ఖాయం.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇన్నాళ్లూ ఏ పార్టీలో చేరాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ వారిద్దరితో చర్చలు కూడా జరిపారు. కానీ పార్టీ మార్పుపై ఆ నేతలిద్దరూ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తన నిర్ణయం ఉంటుందని పొంగులేటి గతంలో చెప్పారు. అంటే ఇక పొంగులేటి కాంగ్రెస్ లో రావడం లాంఛనమే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూపల్లి కూడా అదే బాటలో ఉండే అవకాశం ఉంది. మొత్తంమీద కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇచ్చాయి. కర్ణాటక మాదిరిగా నేతలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో కలిసి పనిచేస్తే కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కర్ణాటక ఫార్ములా ఇక్కడా అమలు చేస్తారా..? నేతలందరూ కలిసి పనిచేస్తారా..?