YSRCP Latest Updates: ఏపీలో ఎన్నికలకు ఇక ఏడాది కూడా సమయం లేదు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అదే ప్రభంజనాన్ని వైసీపీ కొనసాగించింది. 3ఏళ్లపాటు రాష్ట్రంలో ఆ పార్టీ హవా బాగా సాగింది. తిరుపతి, బద్వేల్, ఆత్మకూరు ఉపఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించింది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది.
గతేడాది మంత్రివర్గాన్ని మార్చిన తర్వాత వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత లాంటి నేతలు మంత్రి పదవులు పోవడంతో అలిగారు. సీఎం నేరుగా వారితో చర్చలు జరిపి బుజ్జగించారు. ఆళ్ల నాని లాంటి మరికొందరు నేతలు సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ దక్కదనే ప్రచారం వైసీపీలో తీవ్ర అలజడి రేపింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో ఓడించి రెబల్స్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం.
కొన్నిరోజులుగా వైసీపీలో బాలినేని ఎపిసోడ్ పై చర్చ జరుగుతోంది. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఆయన గుడ్ బై చెప్పడంతో పార్టీలో అలజడి రేగింది. నేరుగా జగన్ .. బాలినేనితో చర్చలు జరిపారు. కానీ సీఎం బుజ్జగింపులకు బాలినేని చల్లారలేదు. ఇలా గతేడాది కాలంగా వైసీపీలో అనేక అంతర్గత సమస్యలు బయటపడ్డాయి. పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ పుంజుకుంటోందని అంటున్నారు. దీంతో సీఎం జగన్ పార్టీలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని మళ్లీ రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారని చర్చ నడుస్తోంది. ఇప్పటికే సీక్రెట్ గా సమావేశమయ్యారని సమాచారం.
ఒకప్పుడు వైసీపీలో జగన్ తర్వాత స్థానం విజయసాయిరెడ్డిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ క్రమంలో పార్టీపైనా , ప్రభుత్వంపైనా సజ్జల పట్టు సాధించారు. షోడో సీఎంగా మారిపోయారనే విమర్శలు వచ్చాయి. సజ్జల ఆధిపత్యాన్ని చాలామంది నేతలు సహించలేకపోతున్నారు. బాలినేని, విజయసాయిరెడ్డితో కూడా సజ్జలకు గ్యాప్ ఉందనే టాక్ ఉంది. రెబల్ ఎమ్మెల్యేలు కూడా సజ్జలనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ కానున్నారా..? సీఎం జగన్ తో రహస్య సమావేశం అందుకేనా? సజ్జలకు విజయసాయి చెక్ పెడతారా..? జగన్ వ్యూహమేంటి..?ఏపీలోనూ, వైసీపీలోనూ ఇప్పుడు ఈ టాపిక్ పైనే చర్చ జరుగుతోంది.