Jagan : వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేశారు. జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మందికి రూ.87.32 కోట్ల ఆర్థికసాయాన్ని అందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి జగన్ నగదు జమ చేశారు.
బాల్యవివాహాలను నివారించడంతోపాటు పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు, ముస్లిం కోసం వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థికసాయం అందిస్తోంది.
కల్యాణమస్తు, షాదీ తోఫాల కింద సాయం పొందే లబ్ధిదారులకు పదో తరగతి ఉత్తీర్ణతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వధువుకు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలని నిర్దేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
వివాహమైన 30 రోజుల్లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను ధ్రువీకరిస్తారు. ఏటా ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్లో లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాల్లో, అదే కులంలోని యువకులను వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.1.20 లక్షలు అందిస్తారు. మైనారిటీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు, వారు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు ఇస్తారు. దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల ఆర్థికసాయం అందిస్తారు.