Hyderabad Latest News(Telangana Updates) : హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మైట్రో రైలు మార్గం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్లు నగరానికి మణిహారాలు మారాయి. ఐటీకి హబ్ గా మారింది. మరోవైపు భాగ్యనగరం ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చెందుతోంది. నగర శివారులో శ్రీరామనగర్ లో నిర్మించిన సమతామూర్తి కేంద్రం భక్తులను ఎంతో ఆకట్టుకుంటోంది. సమతామూర్తి విగ్రహం నగరానికి మరో ఐకాన్ సింబల్ గా మారింది. ఇప్పుడు నగర శివారులో మరో అధ్యాత్మిక కేంద్రం నిర్మాణం కాబోతోంది.
హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ నార్సింగి వద్ద 400 అడుగుల ఎత్తుగల హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం చేపట్టింది. ఈ ఆలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్కు అందమైన ఆధ్యాత్మిక కేంద్రం వస్తోందని కేసీఆర్ అన్నారు.హెరిటేజ్ టవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. త్వరలోనే ఆ నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని తెలిపారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
హరేకృష్ణ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కేసీఆర్ ప్రశంసించారు. కరోనా సమయంలో ప్రజలకు ఎన్నో సేవలు అందించిందని గుర్తు చేశారు.అక్షయపాత్ర కార్యక్రమం చాలా బావుందన్నారు. చిత్తశుద్ధి ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తాయన్నారు. మతమౌఢ్యంతో సమాజానికి కొందరు ఇబ్బందులు కలిగిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. విశ్వశాంతి కోసం అందరూ ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు.