TSRTC News (Telangana Updates) : టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల వేతన సవరణపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ ప్రతిపాదనలపై ఆర్థికమంత్రి హరీశ్రావుతో చర్చించారు.
టీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 44,123 మంది ఉద్యోగులు ఉన్నారు. 2017, 2021కి సంబంధించి రెండు వేతన సవరణలు జరగాల్సి ఉంది. 3 డీఏల బకాయిలు ఉన్నాయని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు. 2017 నాటికి 16 శాతం IRను యథాతథంగా ఉంచుతూ ఫిట్మెంట్ ప్రకటించడం మొదటి ప్రతిపాదన. ఐఆర్ను 20 శాతానికి పెంచి ఫిట్మెంట్ పెంచడం రెండో ప్రతిపాదన. డీఏ బకాయిలు, 16% ఫిట్మెంట్తో వేతన సవరణ చేస్తే సంస్థపై ఏటా రూ.480 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
టీఎస్ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయిస్తోంది. ఇందులో రూ.800 కోట్లు విద్యార్థులు, జర్నలిస్టులు సహా వివిధ వర్గాలకు రాయితీతో ఇచ్చే బస్పాస్లపై రీయింబర్స్మెంట్గా చెల్లిస్తోంది. మిగిలిన మొత్తాన్ని గ్రాంటుగా ఇస్తోంది. వేతన సవరణతో పడే అదనపు భారం రూ.480 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికోసం బడ్జెట్ కేటాయింపులను రూ.2,000 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు తెలస్తోంది. వేతన సవరణతో పడే భారాన్ని గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి.. సీఎం కేసీఆర్తో సమావేశం తర్వాత వేతన సవరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.