Pawan Kalyan(AP Political News) : తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీలో పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీష్ రావుపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వాస్తవ పరిస్థితులు చూడాలని సూచించారు. కొందరు మంత్రులు హరీష్ పై ఘాటుగా స్పందించారు. మామ కేసీఆర్ పై కోపం వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్లను హరీష్ తిడుతుంటారని.. చంద్రబాబు మాదిరి ఎప్పుడోసారి వెన్నుపోటు పొడిచే ఛాన్స్ ఉందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రావాళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలు అడుక్కుతింటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అప్పలరాజు. అయితే ఈ ఇష్యూలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
హరీష్ రావును విమర్శించిన ఏపీ మంత్రుల తీరును జనసేనాని తప్పుపట్టారు. ఈ వివాదంపై పవన్ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు మితిమీరి స్పందిస్తున్నారని అభిప్రాయపడ్డారు. హరీశ్రావుకు సమాధానం చెప్పకుండా.. తెలంగాణ ప్రజలను వైసీపీ నేతలు తిట్టడం సరికాదని హితవు పలికారు.
జనసేనానిపై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. పవన్ కల్యాణ్కు కొత్తగా బీఆర్ఎస్ పై ప్రేమ పుట్టుకు వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు భోజనం మానేశా అన్నాడని.. ఏపీపై తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తే పవన్ ఎందుకు మద్దతు పలుకుతున్నాడని పేర్ని నాని తప్పుబట్టారు. ఏపీపై విమర్శలు చేస్తే మాట్లాడరా? అంటూ ప్రశ్నించారు.
ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఏమీ అనలేదని.. హరీష్రావు వ్యాఖ్యలకే బదులిచ్చారని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. కానీ ఏపీ ప్రజలను కించపరిచేలా పవన్ మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయ కక్షతో మంత్రులపై పవన్ బురద చల్లుతున్నారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ వద్ద ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పి రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని పవన్ పై ఫైర్ అయ్యారు. వ్యాపారాల కోసమే జనసేనాని తెలంగాణకు వంత పాడుతున్నారని విమర్శించారు.