Congress News Telangana: సీన్ 1: కాంగ్రెస్ గెలిస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన కామెంట్ ఇది.
సీన్ 2: మంచిర్యాలలో భట్టి పాదయాత్ర ముగింపు వేడుక. కాంగ్రెస్ సత్యాగ్రహ సభ. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. హస్తం పార్టీ బడా నేతలంతా తరలివచ్చారు. సడెన్గా జనం నుంచి నినాదాలు. భట్టి సీఎం.. భట్టి సీఎం.. అంటూ సభకు వచ్చిన కొందరు కార్యకర్తలు గట్టిగా నినదించారు.
పైరెండు ఘటనలు ఒకేరోజు జరగడం కాకతాళీయమా? వ్యూహాత్మకమా? అనే చర్చ మొదలైంది. కావాలనే కాంగ్రెస్ లీడర్లు దళిత కార్డు బయటకు తీస్తున్నారా? అది దళితులపై ప్రేమా? లేదంటే.. రేవంత్రెడ్డికి చెక్ పెట్టే ఉద్దేశమా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి దూసుకుపోతున్నారు. సీనియర్లు ఆయన దూకుడుకు పదే పదే బ్రేకులు వేస్తున్నారు. బడా నేతలంతా గ్రూపు కట్టారు. రేవంత్రెడ్డి పాదయాత్ర ముగింపు సభకు డుమ్మా కొట్టిన అనేకమంది సీనియర్లు.. భట్టి సభకు హాజరై బాగా హడావుడి చేశారు. ఇక, ఇన్నాళ్లూ రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా మహేశ్వర్రెడ్డిని ముందుంచిన సీనియర్లు.. తాజాగా ఏలేటి రాజీనామాతో ప్లాన్ బి బయటకు తీశారని అంటున్నారు. అదే దళిత సీఎం నినాదం.
సీఎం కేసీఆర్పై రేవంత్రెడ్డి గట్టిగా పోరాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ లోటుపాట్లను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతున్నారు. రేవంత్రెడ్డి దూకుడుతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. రేవంత్ అభిమానులు, కిందిస్థాయి కార్యకర్తలు ఆయన్ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. అధిష్టానం దగ్గరా రేవంత్రెడ్డి పలుకుబడేమీ తక్కువ కాదు. రాహుల్గాంధీకి నమ్మినబంటు. అందుకే, సీనియర్లు ఎంతగా అడ్డుకున్నా రేవంత్కే పీసీసీ పీఠం కట్టబెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రేవంత్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో కేడర్కంటే సీనియర్లకే క్లారిటీ ఎక్కువ.
రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ కావడమే ఇష్టంలేని సీనియర్లు.. ఇక ఆయన్ను సీఎం కానిస్తారా? అందుకే, చెక్ పెట్టే పనులు ఇప్పటినుంచే ప్రారంభించారనే అనుమానం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారంటూ ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించడం మైండ్ గేమ్లో భాగమే అంటున్నారు. మరి, ఆ దళిత సీఎం అభ్యర్థి ఇంకెవరు.. భట్టి విక్రమార్కే అని చెబుతున్నారు. సీనియర్లంతా ఓ జట్టుగా మారి.. భట్టిని ఫుల్గా ఎంకరేజ్ చేస్తున్నారని తెలుస్తోంది. సత్యాగ్రహ సభలో.. భట్టి సీఎం.. అనే నినాదాలు యాదృచ్చికంగా వచ్చినవి కావని.. అంతా పక్కా ప్లాన్డ్గా జరుగుతోందని అంటున్నారు. అయితే, వీళ్లెంత ప్రయత్నించినా.. అధిష్టానం చేయాల్సిన వారినే సీఎం చేస్తుంది. సమర్థత ఉన్నవారికే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది. ఈ సీఎం గోల పక్కనపెట్టి.. పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే దానిపై ఫోకస్ పెడితే బాగుంటుందని అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.