Revanth Reddy: సర్కారు వారి భూదోపిడీ అంటూ వరుస ప్రెస్మీట్లతో విరుచుకుపడుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. మంగళవారం మీడియా ముందుకు వచ్చి.. 2 కుటుంబాలకు రూ.2500 కోట్ల విలువైన భూములు కట్టబెట్టారంటూ.. కేసీఆర్పై, యశోదా హాస్పిటల్ యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మళ్లీ కలకలం రేపారు. ఈసారి కేబీఆర్ పార్కు సమీపంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం గట్టు రట్టు చేశారు. 100 కోట్ల విలువైన ఖరీదైన భూమిని.. తన సన్నిహితులకు కేవలం 17 కోట్లకే కట్టబెట్టారంటూ సీఎం కేసీఆర్పై పదునైన విమర్శలు చేశారు రేవంత్రెడ్డి.
బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలను అరికట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు. అందుకే, కేబీఆర్ పార్క్ చుట్టూ కమర్షియల్ నిర్మాణాలు తక్కువగా ఉన్నాయని.. ఇప్పుడున్న కొన్ని కాంప్లెక్సులు సైతం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో కట్టినవేనంటూ తప్పుబట్టారు.
అయితే, గ్రీన్ జోన్ లో నిబంధనలు ఉల్లంఘించి కొత్తగా భారీ భవనం కట్టడానికి అనుమతి ఇవ్వడంపై మండిపడ్డారు రేవంత్రెడ్డి. నవాబుల పాత బంగ్లాను కూలగొట్టడానికి అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. నిజాం వారసత్వ భవనాన్ని కొనుగోలు చేసి.. కొత్త భవనం కడుతున్నారని విమర్శించారు. నిబంధనల ప్రకారం 5 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉన్న చోట.. ఏకంగా 21 అంతస్తుల బిల్డింగ్ ఎలా కడుతున్నారంటూ రేవంత్ ప్రశ్నించారు. క్యాన్సర్ ఆసుపత్రికి ఇవ్వని పర్మిషన్.. ఆ కమర్షియల్ బిల్డింగ్కు ఎలా ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్కు దగ్గర ట్రాఫిక్ సమస్యలు వస్తాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు రేవంత్రెడ్డి.