CM Jagan News (AP Politics) : ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేల్చింది. ఇతర వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రమేయం ఈ దాడిలో లేదని నిర్ధారించింది. అప్పట్లో శ్రీనివాసరావు పనిచేసిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని తొట్టెంపూడి హర్షవర్ధన్ ప్రసాద్ తనను చంపేందుకు పన్నిన కుట్రలో భాగస్వామి అని జగన్ చేసిన అభియోగం అవాస్తవమని తేల్చింది. దాడిలో అతని పాత్ర, ప్రమేయం లేవని నిర్ధారించింది. దాడికి కొన్నిరోజుల ముందు నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పని చేయట్లేదంటూ జగన్ చేసిన మరో అభియోగం నిజంకాదని చెప్పింది. అన్ని సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని వెల్లడించింది.
కుట్ర కోణం వెలికితీసేలా మరింత దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏకు ఆదేశాలివ్వాలని జగన్ ఇటీవల ఎన్ఐఏ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో ఈ కేసు విచారణ ఇప్పటికే ప్రారంభమైనందున తదుపరి ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని, జగన్ దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేయాలని ఎన్ఐఏ తన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది.
జగన్పై దాడిలో కుట్ర ఏమైనా ఉందా.. అన్న అంశం సహా అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేశామని స్పష్టం చేసింది. ఏపీ పోలీసులు నుంచి కేసు రికార్డులను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించామని తెలిపింది. నిందితుడు, అతనితో పనిచేసిన వారి మొబైల్ ఫోన్లలోని డేటాను వెలికితీశామని చెప్పింది. ఫోరెన్సిక్ విశ్లేషణ చేయించామని వెల్లడించింది. విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీల్లోని దృశ్యాలు విశ్లేషించామని వివరించింది. కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చిచెప్పింది. ఫిర్యాదుదారైన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సాక్ష్యాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది.