Maheswar Reddy (Telangana News Updates) : తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఇటీవల ఆయనకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తనకు నోటీసులు ఇచ్చే అధికారం టీపీసీసీ లేదని మహేశ్వర్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుస్తానన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం వద్దే తేల్చుకుంటానని చెప్పారు.
అయితే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి పార్టీకే రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏలేటిని తరుణ్ చుగ్ నివాసానికి తీసుకెళ్లారు. అనంతరం కాషాయ పార్టీలోకి ఆయనను తరుణ్ చుగ్ ఆహ్వానించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. మహేశ్వర్ రెడ్డికి నడ్డా కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
మహేశ్వర్ రెడ్డి గతంలో నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 15 ఏళ్లు ఉన్నానని ఏలేటి చెప్పారు. ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్గా ఇలా వివిధ హోదాల్లో పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నో ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని పని చేశానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎలాంటి ఆరోపణలులేని మచ్చలేని చరిత్ర తనదని స్పష్టంచేశారు. ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించలేదన్నారు. అయితే కాంగ్రెస్లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూసి పార్టీలో ఇమడలేనని అర్ధమైందన్నారు. అందుకే కాంగ్రెస్లో ఇక కొనసాగలేనని భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని మహేశ్వర్రెడ్డి రాజీనామా లేఖలో పేర్కొన్నారు.