Etala, Bandi : తెలంగాణలో పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు పేపర్ లీకుకు కుట్ర పన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. TSPSC కేసును తప్పుదోవ పట్టించడానికే రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ కేసులో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు విచారించారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ.. ఈటలను గంటపాటు ప్రశ్నించారు.
పదో తరగతి హిందీ పేపర్ లీక్ పై విచారణ తర్వాత ఈటల రాజేందర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కుట్రపూరితంగానే తనపై కేసు నమోదు చేశారన్నారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్ డైరెక్షన్లోనే బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దేశంలోనే ధనిక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. సొమ్ము తెలంగాణ ప్రజలది.. సోకు కేసీఆర్దని విమర్శించారు. 22 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న తాను బాధ్యత గల పౌరుడిగానే వ్యవహరించానని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే పదో తరగతి పేపర్ లీక్ను తెరపైకి తెచ్చారని అన్నారు.
పదో తరగతి పేపర్ లీక్ కేసులో తొలుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ రావడంతో కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్ట్ చేసే సమయంలో తన ఫోన్ మిస్సైందని బండి సంజయ్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ అప్పగించాలని పోలీసులు కోరుతుంటే అదే ఫోన్ పోయిందని బండి సంజయ్ ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. తాజాగా కమలాపూర్ పోలీసులు బండి సంజయ్ కు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మొబైల్ ను కూడా తీసుకురావాలని కోరారు. ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆ నోటీసులకు బండి సంజయ్ రిఫ్లై ఇచ్చారు.