BRS (Telangana News) : ఖమ్మ జిల్లా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం జరిగింది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గుడిసెపై తారాజువ్వ పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
గుడిసెలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. పేలుడు ధాటికి పలువురు కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఘటనాస్థలి రక్తసిక్తంగా మారింది.
ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. సిలిండర్ పేలుడికి, బాణాసంచాకు సంబంధం లేదని నామా స్పష్టం చేశారు. ఎండ వేడికి సిలిండర్ పేలినట్లుగా భావిస్తున్నట్లుగా చెప్పారు. ఏదైనా జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అవసరమైతే గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తామన్నారు.
ప్రమాదంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పార్టీ పరంగా ఆదుకుంటామన్నారు.